Labels

దేశమంతా ఒకే గుర్తింపు కార్డు: అమిత్‌షా

23-09-2019
న్యూఢిల్లీ: 'ఒకేదేశం...ఒకే గుర్తింపు కార్డు' తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. అన్ని అవసరాలకూ ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకురావాలనుకుంటున్నట్టు సూత్రప్రాయంగా ఆయన తెలిపారు. ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా...ఈ అవసరాలన్నింటికీ ఒకే బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు ఉంచుకోవచ్చని, అది ఆచరణ సాధ్యమని అన్నారు. ఇందువల్ల వేర్వేరు డాక్యుమెంటేషన్ల అవసరం ఉండదన్నారు.


 

సోమవారంనాడిక్కడ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ నూతన ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2021 జనాభా లెక్కింపులో మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తామని, జాతీయ జనాభా రిజిస్టర్‌ను కూడా తయారు చేస్తామని అన్నారు. ఒక వ్యక్తి చనిపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నట్టు చెప్పారు. 'ఎన్నికల జాబితా అప్‌డేషన్‌లో వ్యక్తి జనన, మరణ రిజిస్టేషన్‌‌ను ఎందుకు అనుసంధానం చేయకూడదు? 18 ఏళ్లు వచ్చేసరికి సదరు వ్యక్తులను ఎన్నికల జాబితాల్లో చేర్చడం లేదా? అదేవిధంగా, మరణాన్ని సదరు కుటుంబం రిజిస్టర్ చేసినప్పుడు, ఓటర్ల జాబితా నుంచి మృతిచెందిన ఓటరును ఆటోమేటిక్‌గా తొలగించడం ఎందుకు సాధ్యం కాదు?' అని అమిత్‌షా ప్రశ్నించారు.