Labels

అవిశ్వాసం.... అంతా నాటకం

కాంగ్రెస్, టిడిపి మ్యాచ్‌ఫిక్సింగ్? శాసన సభ వేదికగా బహిర్గతం నోటీసిచ్చీ.. నోరెత్తని టిడిపి దేశం తీరుతో రాజకీయ పక్షాలు విస్మయం టిడిపి రెండోసారి అవిశ్వాసం నోటీసు అదీ చెల్లని నాణెమేనని అనుమానాలు? గవర్నర్‌ను కలిసిన బాబు బృందం బాబు వైఖరిపై కెసిఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజం

హైదరాబాద్,: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ఆరోపణలకు, శనివారం శాసనసభలో తెలుగుదేశం వ్యవహరించిన తీరు ఊతమిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిపై రాజకీయ వర్గాల్లో మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ గతంలో అనుసరించిన తీరుకు శనివారం సభలో అనుసరించిన తీరుకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా బయటపడింది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు ఇది బలాన్ని చేకూరుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో కొన్ని రోజులుగా పదపదే మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ, శనివారం శాసనసభలో కనీసం మాటవరసకైనా ప్రస్తావించక పోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రతి చిన్న అంశానికి శాసనసభను రోజుల తరబడి అడ్డుకుని స్పీకర్‌పైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చే తెలుగుదేశం పార్టీ, ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సభ నిరవధికంగా వాయిదా పడేంత వరకూ చంద్రబాబు దగ్గర నుంచి టిడిపి సభ్యులెవరూ అవిశ్వాస తీర్మానం నోటీసు గురించి ఒక్క మాటైనా అడగలేదు. అవిశ్వాసం గురించి సభలో మాట్లాడని చంద్రబాబు బృందం, సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. పదిరోజుల్లో అసెంబ్లీని సమావేశపరచి తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరింది. టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై బల నిరూపణ చేసుకోవలసింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కాగా, చంద్రబాబు మాత్రం విచిత్రంగా గవర్నర్ ఎదుట బలం నిరూపించుకోవాలని జగన్‌ను డిమాండ్ చేశారు. స్పీకర్ ఎన్నికలో జగన్ తమ అభ్యర్ధికి మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మరోపక్క అవిశ్వాసం విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిపై తెరాస అధినేత కెసిఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ, అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాంగ్రెస్, చంద్రబాబుల మధ్య సాగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ అవిశ్వాస తీర్మానం విషయంలో బయటపడిందని వారు ఆరోపించారు.
రెండురోజుల కిందట ఇచ్చిన నోటీసు చెల్లదని తేలడంతో, శనివారం ఉదయం పదిగంటల ప్రాంతంలో టిడిపి ఎమ్మెల్యేలు శాసనసభ కార్యదర్శిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై మరో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు అందజేశారు. టిడిపి నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్‌రెడ్డి, హరీశ్వర్‌రెడ్డి, జోగి రామన్న విడిగా మరో నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం విషయం తేలేవరకూ స్పీకర్ ఎన్నిక జరగకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకోవచ్చని ప్రతిపక్షాలు భావించాయి. కానీ విచిత్రంగా సభ ఆరంభం నుంచి ముగిసే వరకు టిడిపి సభ్యులు ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించనే లేదు. స్పీకర్ ఎన్నిక నిర్వహణకు విధానాన్ని మార్చే విషయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి డి శ్రీ్ధర్‌బాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ జెసి దివాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు లేవడంతో అవిశ్వాస తీర్మానం గురించే మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన ప్రసంగం సభ్యులందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా సాగింది. ‘నిబంధనలు మార్చి స్పీకర్ ఎన్నికను నిర్వహించడానికి మాకు అభ్యంతరం లేదు. అయితే అందుకు సరైన విధానాన్ని అనుసరించాలి. ఏ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అభ్యర్ధులకే ఓటు వేయాలన్నది మా విధానం. ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీకి ఓటు వేయడం అనైతికం’ అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.
అవిశ్వాసం నోటీసు చెల్లనట్టేనా?
నిబంధనల ప్రకారం శాసనసభ ప్రారంభం కావడానికి గంట ముందు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత నోటీసు ఇచ్చిన సభ్యుడు సభలో దాని గురించి ప్రస్తావించినట్లయితే దాన్ని పరిశీలించి పది రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ చెబుతారు. అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల మేరకే శనివారం టిడిపి ఇచ్చింది. అయితే సభలో నోటీసు గురించి టిడిపి ప్రస్తావించనే లేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనంతరం శాసనసభ సమావేశాలను డిప్యూటీ స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చెల్లని నాణమే అవుతుందని శాసనసభ వర్గాలు అంటున్నాయి.
సభ జరిగినంత సేపు అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించకుండా, సభ వాయిదా పడిన తర్వాత టిడిపి సభ్యులు ఇది అన్యాయం అని నినాదాలు చేస్తూ వెళ్ళి పోయారే తప్ప అప్పుడైనా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడలేదు. తర్వాత చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానం గురించి చెబుతూ పది రోజుల్లో మళ్ళీ సభను ఏర్పాటు చేయాలని కోరారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తే బల నిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రిని ఆదేశిస్తూ, అందుకు కొంత గడువు ఇవ్వడం సాంప్రదాయమని అంటున్నారు. కానీ ప్రతిపక్ష సభ్యులు వెళ్ళి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తే గవర్నర్ చేయగలిగింది ఏమీ ఉండదని, ఆ విషయాన్ని తేల్చాల్సింది శాసనసభ స్పీకర్ మాత్రమేనని చెబుతున్నారు.

No comments:

Post a Comment