Labels

మొబైల్ ఇంటర్నెట్ వేగంలో శ్రీలంక, పాక్ తర్వాతి స్థానంలో భారత్!


మొబైల్ ఇంటర్నెట్ వేగంలో శ్రీలంక, పాక్ తర్వాతి స్థానంలో భారత్!
23-09-2019


న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగంలో దూసుకుపోతున్నామని సంబరపడిపోతున్న భారతీయులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. మొబైల్ ఇంటర్నెట్ వేగంలో భారత్ అట్టడుగున ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆగస్టు నెలకుగాను మొబైల్ ఇంటర్నెట్ వేగంపై మొత్తం 145 దేశాల్లో జరిగిన అధ్యయనంలో మనది 131 స్థానంగా తేలింది. ఈ మేరకు ఊక్లాకు చెందిన ‘స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్’ వెల్లడించింది.

ఈ జాబితాలో దక్షిణ కొరియా సగటున 111 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు కావడం విశేషం. 66.45 ఎంబీపీఎస్ వేగంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, ఖతర్, నార్వే, యూఏఈలు వరుసగా 65.62 ఎంబీపీఎస్, 65.35 ఎంబీపీఎస్, 64.11 ఎంబీపీఎస్ వేగంతో మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.

ఇక, ఈ జాబితాలో అమెరికా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. సగటున 36.23 ఎంబీపీఎస్ వేగంతో 35వ స్థానంలో నిలిచింది. భారత్ పేరు తొలి వంద స్థానాల్లోనూ కనిపించలేదు. సగటున 10.65 ఎంబీపీఎస్ వేగంతో 131 స్థానంలో నిలిచింది. అయితే, సగటు డౌన్‌లోడు స్పీడు మాత్రం 9.15 ఎంబీపీఎస్ నుంచి 10.65 ఎంబీపీఎస్‌కు పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. అప్‌లోడ్ వేగం కూడా 3.48 ఎంబీపీఎస్ నుంచి 4.23 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అన్నింటికంటే తక్కువగా సగటున 4.7 ఎంబీపీఎస్ వేగంతో తూర్పు తైమూర్ అట్టడుగున నిలిచింది.

భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్‌లు ఇంటర్నెట్ వేగంలో మనకంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. శ్రీలంక 22.04 ఎంబీపీఎస్ వేగంతో 83వ స్థానంలోను, పాకిస్థాన్ 13.08 ఎంబీపీఎస్ వేగంతో 118 స్థానంలోనూ, నేపాల్ 10.78 ఎంబీపీఎస్ వేగంతో 130 స్థానంలోనూ నిలిచాయి. ఊక్లా గతేడాది డిసెంబరులోనూ ఇటువంటి గణాంకాలే విడుదల చేసింది. అప్పట్లో మొత్తం 123 దేశాల్లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వేగంలో 126 దేశాల్లో 65వ స్థానం దక్కించుకుంది.